ఎంఎస్ ధోని సినిమాహీరో ఆత్మహత్య

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. సుశాంత్‌ సింగ్‌ ముంబైలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. సుశాంత్‌ సింగ్‌ ఆకస్మిక మరణంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సుశాంత్‌ సింగ్‌ టీవీ సీరియళ్లతో కెరీర్‌ చేసి సినిమాలతో సక్సెస్‌ఫుల్‌ గా కెరీర్‌ కొనసాగిస్తున్న ఇలా ఆత్మహత్యకు పాల్పడటం సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ 1986 జనవరి 21న పాట్నాలో జన్మించాడు. టీవీ సీరియల్స్‌ ద్వారా నటుడిగా పరిచయమైన సుశాంత్‌ ఆ తర్వాత డ్యాన్సర్‌గా కూడా తన ప్రతిభను చాటుకున్నాడు. స్టార్‌ప్లస్‌లో ప్రసారమైన కిస్‌ దేశ్‌ మే హై మేరా దిల్‌ చిల్‌ షో నటుడిగా కెరీర్‌ ప్రారంభించాడు. జీ టీవీలో పాపులర్‌ అయిన పవిత్ర రిస్థాకు అవార్డు కూడా పొందాడు.
2013లో కై పో చే చిత్రంలో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ హీరోగా అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత శుధ్‌ దేశీ రొమాన్స్‌ చిత్రంలో నటించాడు. డిటెక్టివ్‌ భ్యోమకేశ్‌ బక్షీ (2015)లో డిటెక్టివ్‌ పాత్రలో అందరినీ ఆకట్టుకున్నాడు. అమీర్‌ఖాన్‌ హీరోగా నటించిన పీకే చిత్రంలో సపోర్టింగ్‌ రోల్‌ లో కనిపించాడు. 2016లో వచ్చిన టీమిండియా క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ బయోపిక్‌ ‘ఎంఎస్‌ ధోని..ది అన్‌టోల్డ్‌ స్టోరీ’ లో తన నటనకు ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్‌ పురస్కారం అందుకున్నాడు. కేదార్‌నాథ్‌ చిత్రంలో లవర్‌బాయ్‌ పాత్రలో అందిరినీ అలరించిన సుశాంత్‌ ఆకస్మిక మరణం చిత్రపరిశ్రమకు తీరని లోటనే చెప్పాలి. సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ మాజీ మేనేజర్‌ దిశా సేలియన్‌ ఇటీవలే ఆత్మహత్య చేసుకున్నాడు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews