దమ్ముంటే కేంద్రం నుండి నిధులు రాలేదని టీఆర్ఎస్ శ్వేతపత్రం విడుదల చేయాలి – సోయం బాపురావు

కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించలేదని రాష్ట్ర మంత్రులు విమర్శలు చేయడం సరికాదని, దమ్ముంటే కేంద్రం నుంచి నిధులు రాలేదని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఎంపీ సోయం బాపురావు సవాల్‌ విసిరారు. శుక్రవారం స్థానిక శాంతినగర్‌లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో మంది కరోనా బారినపడి బాధపడుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రం ఫాంహౌస్‌లో కూర్చొని తన ప్రాణాలు బాగుంటే చాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారని, సరైన వైద్యం అందక ప్రతీరోజు కరోనా మరణాలు పెరుగుతున్నాయన్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తే దోపిడీకి గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తూ కేంద్రం నుంచి నయాపైసా రాలేదని రాష్ట్ర మంత్రులు విమర్శిస్తూ ప్రజలను తప్పుతోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రధాని మోదీ కార్మికులు, నిరుద్యోగులను ఆదుకునేందుకు ఆత్మనిర్భర్‌ కింద రూ.90 వేల కోట్లు విడుదల చేశారని గుర్తు చేశారు. అందులోంచి తెలంగాణకు రూ.7,650 కోట్లు కేటాయించారన్నారు. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చూస్తోందని దుయ్యబట్టారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిరుపేదలు ఇబ్బంది పడకుండా జన్‌ధన్‌ ఖాతాల్లో డబ్బులు వేశామని..ఉచితంగా వంటగ్యాస్‌ ఇచ్చామని, నిరుద్యోగులకు, చిరువ్యాపారులకు స్వయం ఉపాధి రుణాల కోసం నిధులు కేటాయించామన్నారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కలిపిస్తూ.. పంట బీమా కోసం రూ.64 కోట్లు కేటాయించామన్నారు. కరోనా కట్టడికి రాష్ట్రంలో పరీక్షలు నిర్వహించేందుకు 14 ప్రభుత్వ ల్యాబ్‌లు, 21 ప్రైవేటు ల్యాబ్‌లకు అనుమతి ఇచ్చామని గుర్తుచేశారు. అంతే కాకుండా 42 లక్షలు పీపీఈ కిట్లు, 6.49లక్షల మాస్కులు కేంద్రం నుంచి వచ్చాయన్నారు. ఇంత చేసినా కేంద్రం నుంచి ఏమి రాలేదనడం విడ్డూరంగా ఉందన్నారు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews