ఆస్థి గొడవలో మెగాస్టార్ ఎంట్రీ

సిని ప‌రిశ్ర‌మ‌లో పెద్ద‌దిక్కుగా ఉన్న దాసరి నారాయణరావు చనిపోయిన త‌ర్వాత ఆయ‌న ఆస్తి కోసం ఇద్ద‌రు త‌న‌యులు గోడ‌వ‌లు ప‌డుతున్నారు.. అన్నదమ్ముల మధ్య తలెత్తిన ఆస్తి గొడవలు పోలీస్ స్టేషన్‌కు చేరాయి. కాగా త‌న సోద‌రుడు అరుణ్‌ అర్ధరాత్రి ఇంట్లోకి వచ్చి బీరువా తెరిచేందుకు ప్రయత్నించాడని.. అడ్డుకున్న తమపై దాడికి చేశాడని ప్రభు ఆరోపించారు. ఆస్తులపై న్యాయస్థానంలో విచారణ కొనసాగుతుండగా అరుణ్ తనను బెదిరిస్తున్నాడన్నారు. అరుణ్‌ కుమార్ రాత్రి సమయంలో అనుచరులతో గోడదూకి తన ఇంట్లోకి ప్రవేశించాడని.. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ప్రభు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 24న రాత్రి దాసరి అరుణ్‌తో పాటు అతడి డ్రైవర్‌ ఇంటి గేటు దూకి లోపలికి వెళ్ళినట్లు పోలీసులు గుర్తించారు. జూబ్లీహిల్స్‌లోని ఇల్లు విషయంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. ఇల్లు నాదంటే నాదంటూ.. అరుణ్‌-ప్రభు త‌గువులాడుకుంటున్నారు. ఆ ఇల్లు తన కూతురి పేరు మీద దాసరి వీలునామా రాశారని ప్రభు చెబుతున్నారు. ఇది ఇలా ఉంటే ప్ర‌భు ఆరోప‌ణ‌ల‌ను అరుణ్ కొట్టివేశారు.. త‌న ఇంటిలోకి తాను గోడ దూకి వెళ్ల‌డ‌మేమిట‌ని ప్ర‌శ్నించారు.. ఆ ఇంటిపై త‌న సోద‌రి, సోద‌రుడితో పాటు సంపూర్ణ హ‌క్కులున్నాయ‌న్నారు.. ఆస్తి త‌గాదాలు ప్ర‌తి ఇంటిలోనే ఉండేవేన‌ని, వాటిని భూత‌ద్దంలో చూడాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.. ఆస్థి హ‌క్కుల‌పై త‌న తండ్రి రాసిన వీలునామా ఉంటే చూపాల‌ని అరుణ్ డిమాండ్ చేశారు.. త‌మ ఆస్థి వివాదంపై సినీ పెద్ద‌లు రాజీ ప్ర‌య‌త్నాలు చేస్తే తాను సంపూర్ణంగా స‌హ‌క‌రిస్తాన‌ని అన్నాడు.. ఇది ఇలా ఉంటే సినీ ప‌రిశ్ర‌మ‌లో అత్యంత గౌర‌వ మ‌ర్యాద‌లు అందుకుని, అంద‌రి స‌మస్య‌లు ప‌రిష్క‌రించిన దాస‌రి కుటుంబ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు మెగాస్టార్ చిరంజీవి త‌న ప్ర‌య‌త్నాలు ప్రారంభించిన‌ట్లు టాక్.. అన్న‌ద‌మ్ముల‌తో పాటు వారి సోద‌రితోనూ కొంద‌రు సినీ ప్ర‌ముఖులు చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు.. త్వ‌ర‌లోనే ఈ వివాదానికి ముగింపు ఉంటుద‌ని భావిస్తున్నారు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews