ముందుగా వారికే కరోనా వాక్సిన్ -ఈటెల రాజేందర్

వ్యాక్సిన్‌ వస్తే ముందుగా పేదలకు, బస్తీల్లో ఉండేవాళ్లకు ప్రాధాన్యం ఇస్తామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు ప్రత్యేకంగా కమిటీ వేసి అమలు చేస్తామని తెలిపారు. తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ దేశంలోనే మూడో స్థానంలో ఉందన్నారు. ఉపసంఘం భేటీలోనూ, ఆ తర్వాత నిర్వహించిన విలేకరుల సమావేశంలోనూ ఈటల మాట్లాడారు. వైద్యశాఖపై ముఖ్యమంత్రికి ఉపసంఘం నివేదిక ఇవ్వనుందని చెప్పారు. ‘సబ్‌ సెంటర్ల స్థానంలో వెల్‌నెస్‌ సెంటర్లను బలోపేతం చేస్తాం. ఆరోగ్య శ్రీ కోసం ప్రభుత్వం రూ.1,200 కోట్లు ఖర్చు చేస్తుంది. మరోవైపు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కూడా ఖర్చు చేస్తుంది.
ఆరోగ్యశ్రీలోకి మరిన్ని సేవలు అందుబాటులోకి తెస్తాం. కిడ్నీ, హార్ట్, లివర్‌ మార్పిడి శస్త్ర చికిత్స కోసం రూ.30 లక్షల ఖర్చవుతుంది. వీటన్నింటినీ ఆరోగ్యశ్రీ కింద చేయాలని కమిటీ నిర్ణయించింది. ఎంఎన్‌జే కేన్సర్‌ ఆసుపత్రిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పటికీ రూ.40 కోట్లు కొత్త బిల్డింగ్‌ కోసం కేటాయించాం. కేన్సర్‌ రోగులకు ఉచితంగా వైద్యం అందించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఆరోగ్యశ్రీపైనా సీఎంకు ఉపసంఘం ప్రత్యేక నివేదిక ఇవ్వనుంది. తెలంగాణ ప్రజల హెల్త్‌ ప్రొఫైల్‌ సిద్ధం చేస్తాం. నవజాత శిశువుల మరణాల రేటు 39 నుంచి 27కి తగ్గింది. మాతృత్వపు మరణాల రేటు 92 నుంచి 63కు తగ్గింది. ఇది దేశంలోనే రికార్డు.. సీజనల్‌ వ్యాధులు తగ్గడం మిషన్‌ భగీరథ పథకం సాధించిన విజయం. మలేరియా పూర్తిగా అదుపులోకి వచ్చింది’అని ఈటల వెల్లడించారు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews